కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ

29 Mar, 2015 04:11 IST|Sakshi
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ

 లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్‌లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్‌సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు. ఎక్కువ శాతం ఓట్లు సంపాదించుకున్న ప్రముఖుల బొమ్మలు తయారు చేయించి, వారి చేతుల మీదగానే ఆవిష్కరింపజేస్తారు.
 
 అలా ఇప్పటివరకూ హిందీ రంగానికి చెందిన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్‌ల మైనపు బొమ్మలు ఆ మ్యూజియమ్‌లో కొలువుదీరాయి. తాజాగా, ఈ ఏడుగురి చెంత కత్రినా కైఫ్ చేరారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్.. ఈ ముగ్గురిలో ఎవరి బొమ్మ పెడితే బాగుంటుందనే విషయంపై మేడమ్ టుస్సాడ్స్‌వారు ఓటింగ్ పెడితే, అందరికన్నా ఎక్కువ ఓట్లు కత్రినాకి పడ్డాయి.
 
 ఈ బ్యూటీకి 2 లక్షల 25వేల ఓట్లు పడ్డాయట. దాంతో ఈవిడగారి మైనపు బొమ్మ తయారు చేయించడానికి టుస్సాడ్స్ మ్యూజియమ్‌వాళ్లు రంగంలోకి దిగారు. కత్రినాకి విషయం చెప్పి, ఆమె అనుమతితో శరీర కొలతలు తీసుకున్నారు. ఆ కొలతల ప్రకారం ప్రపంచ ప్రఖ్యాత శిల్పులతో కత్రినా మైనపు బొమ్మ తయారు చేయించారు. నాలుగు నెలలు శ్రమించి, తయారు చేసిన ఈ బొమ్మకు అయిన ఖర్చు కోటీ 40 లక్షల రూపాయలని సమాచారం. ఈ బొమ్మను సిల్వర్ కలర్ గాగ్రా, పింక్ రంగు చున్నీతో అలంకరించారు.