ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘ఒక ఆడపిల్లకి చక్కని సంబంధం చూసి పెళ్ళి చేయాలంటే మంచిచెడులు చాలా చూడాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాను కూడా మంచి డేట్ చూసి రిలీజ్ చెయ్యాలని అనుకున్నాం. అలా ఆగస్ట్ 23 చాలా మంచి డేట్ అని భావించి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రెండు వందల శాతం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈనెల 23న విడుదల చేస్తున్నాం.
ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాతే మా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ కౌసల్య కృష్ణమూర్తి. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అటువంటి రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, భీమనేని శ్రీనివాసరావు.. ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు అందించే మరో గొప్ప సినిమా కౌసల్య కృష్ణమూర్తి అని నమ్ముతూ.. క్రియేటివ్ కమర్షియల్స్ ద్వారా మరో మంచి సినిమాను ప్రజెంట్ చేస్తున్నాను. తప్పసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా ‘ముద్దాబంతి పూవు ఇలా..’ అనే పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఆగస్ట్ 23న వరల్డ్వైడ్గా మా సినిమా విడుదలవుతుంది’ అన్నారు.