కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

17 Sep, 2019 11:38 IST|Sakshi

బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.. బయటకు వచ్చాక అంతకు మించి చేశాడు. గొప్పలకు పోయి ఎన్నో తిప్పలు పడ్డాడు. పీఎమ్‌ఓ ఆఫీస్‌ నుంచి తనకు కాల్‌ వచ్చిందని, డాక్టరేట్‌ పట్టా ఇవ్వనున్నట్లు ఇలా ఏవోవే చెప్పి నవ్వులపాలయ్యాడు. అయితే బిగ్‌బాస్‌ తెచ్చిన పాపులార్టీని ఉపయోగించుకుని ఏదో చేద్దామనుకున్న కౌశల్‌కు ఎలాంటి ప్రయోజనం కలగలేదనిపిస్తోంది.

కౌశల్‌ పేరిట ఓ ఆర్మీ అప్పట్లో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో కౌశల్‌ చేసిన పోరాటానికి అతని ఫాలోవర్స్‌ 2కే రన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కౌశల్‌ ఆర్మీపైనా.. ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీని ద్వారా ఏర్పాటు ఫౌండేషన్‌, సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నంటి ద్వారా కౌశల్‌ పేరు మీడియాలో మార్మోగిపోయింది. కౌశల్‌ ఆర్మీని నడిపించిన అభిమానులు రోడ్డు మీదకు రావడం, మీడియా గడపలు తొక్కడం ఎంతటి దుమారం లేపిందో అందరికీ తెలిసిందే.

అయితే మరో సారి కౌశల్‌ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న కౌశల్‌ను.. మీడియా ప్రతినిధి ఓ ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్నకు కౌశల్‌ చెప్పిన సమాధానం మూలంగా అతడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో టాప్‌3 కంటెస్టెంట్ల పేర్లు చెప్పండని రిపోర్టర్‌ అడగా​.. నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ అంతా వారికే సపోర్ట్‌ చేస్తుంది.. అప్పుడు మిగతావారికి అన్యాయం జరుగుతుంది అని సమాధానం చెప్పాడు. ఇక ఈ విషయంపై నెటిజన్లు కౌశల్‌ ఏకిపారేస్తున్నారు. ఇంకా అదే భ్రమలో ఉన్నాడా? ఇంకా ఆ ఆర్మీ ఉందా? అంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తుండగా.. అతని ఫాలోవర్స్‌ మాత్రం మంచి సమాధానమిచ్చావ్‌ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

మరిన్ని వార్తలు