ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్, సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేదార్నాథ్’ . ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ టీజర్ ఇదివరకే విడుదలై మంచి ఆదరణ పొందింది. 2013 సంవత్సరంలో చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ చారదామ్ వరదల నేపథ్యంతో సాగే ప్రేమ కథగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కేదార్నాథ్(తీర్థ్ పురోహిత్) ఆలయ పూజారులు మండిపడుతున్నారు.
హిందూ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందని, సినిమా విడుదల చేస్తే ఊరుకోమంటున్నారు. సినిమా ‘లవ్ జీహాదీ’ని ప్రోత్సహించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. సినిమాను విడుదల కానివ్వమని, ఒక వేళ విడుదల చేయాలని చూస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రుద్రప్రయాగలో కొంతమంది నిరసనకారులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.