అలాంటి పాత్రల్లో నటించను : కీర్తి సురేష్‌

18 Nov, 2018 10:07 IST|Sakshi

కీర్తిసురేశ్‌ ఈమె పేరులోనే కీర్తి ఉందనుకుంటే ఇప్పుడు తన ప్రతిభతోనూ ఆ పేరును సార్ధకం చేసుకుంటోంది. నిజం చెప్పాలంటే ఆమె తల్లి మేనక సాధించలేని కలలను ఈ అమ్మడు నెరవేర్చుతోందని చెప్పవచ్చు. మేనక రజనీకాంత్‌కు జంటగా నెట్రకన్‌ చిత్రంలో నటించినా, ఆ తరువాత తమిళంలో పెద్దగా పేరు తెచ్చే చిత్రాల్లో నటించలేదు.

మలయాళీ చిత్ర నిర్మాత సురేశ్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయ్యారు. అలా ఆమె వారసురాలిగా పరిచయమైన కీర్తీసురేశ్‌ నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం నిరాశపడడంతో ఈ అమ్మడికి నటిగా పెద్దగా భవిష్యత్తు ఉండదేమో అనే టాక్‌ అప్పట్లో వినిపించింది. అలాంటిది రజనీమురుగన్, రెమో వంటి చిత్రాలు వరుసగా విజయం సాధించడం, మహానటి చిత్రంలో సావిత్రిని మరిపించడం వంటివి కీర్తీసురేశ్‌ స్థాయిని పెంచేశాయి.

అంతే స్టార్‌ హీరోలు విజయ్, విశాల్, విక్రమ్‌ వంటి వారితో నటించేసి స్టార్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో చేరిపోయింది. మరో విషయం ఏమిటంటే కమర్శియల్‌ చిత్రాల్లో నటించాలంటే అందాలు ఆరబోయాలనే ట్రెండ్‌ను బ్రేక్‌ చేసిన నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటిలోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే తెచ్చుకుంది.

ఇకపై కూడా ఇలానే నటిస్తానంటోంది. ప్రస్తుతం కొత్త చిత్రాల ఎంపికలో బిజీగా ఉన్న కీర్తీసురేశ్‌ ఆమెను వెతుకుంటూ వస్తున్న గ్లామర్‌ పాత్రలను సున్నితంగానే తిరస్కరిస్తోందట. దీని గురించి ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ గ్లామర్‌ పాత్రల్లో నటించి చాలా సంపాందించుకోవచ్చునని, అయితే అలాంటి పాత్రల్లో నటించడం తనకు సమ్మతం కాదని చెప్పింది.

మహానటి చిత్రంలో నటించనట్లుగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. చాలా డబ్బు సంపాదించాలనే కంటే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న  బలమైన పాత్రల్లో నటించి ఆత్మ సంతృప్తి పొందాలన్నదే తన ఆశ అని పేర్కొంది. ఈ బ్యూటీ త్వరలో బాహుబలి ఫేమ్‌ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది.

మరిన్ని వార్తలు