సినిమా: ఈ మధ్యకాలంలో లక్కు అంటే నటి కీర్తీసురేశ్దే అని చెప్పాలి. మహానటి సావిత్రిగా నటించే అవకాశం రావడమే ఈ బ్యూటీకి గొప్ప అదృష్టం. అయితే ఆ పాత్రగా మారడానికి కీర్తీసురేశ్ ఎంతో కృషి చేసి సఫలీకృతం అయ్యింది. సావిత్రిగా నటించాలంటే ఈ భామే నటించాలి అన్నంతగా పేరు తెచ్చుకుంది. అందుకే బాలకృష్ట హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్లో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు ఈ అమ్మడినే వరించింది. అయితే ఆ అవకాశాన్ని కీర్తీసురేశ్ అంగీకరించలేదు. ఇకపోతే కోలీవుడ్లో వరుసగా విక్రమ్, విశాల్, విజయ్ వంటి స్టార్స్తో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఏ ఒక్క చిత్రం అంగీకరించలేదు. రెస్ట్ లేకుండా నటించాను కాస్త విరామం తీసుకుంటానని ప్రకటించింది.
అందులో అసలు విషయం దాగి ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ జాణకు రాజమౌళి తాజా చిత్రంలో నటించే మరో లక్కీచాన్స్ తలుపు తట్టిందన్నదే ఆ రహస్యం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇందులో ఒక కథానాయకిగా నటి కీర్తీసురేశ్ నటించబోతోందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 29 నుంచి మొదలవనుంది. రెండవ షెడ్యూల్లో కీర్తీసురేశ్ పాల్గొననున్నట్లు టాక్. అప్పటిదాకా ఈ అమ్మడు రెస్ట్ తీసుకుంటుంది. రాజ మౌళి తన చిత్రంలోని హీరో యిన్ల గురించి అధికారపూర్వకంగా వెల్ల్లడించలేదన్నది గమనార్హం.