గోల్డెన్‌ హార్ట్‌

23 Jan, 2018 02:12 IST|Sakshi

బంగారం ధర సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయింది. ఇలాంటి టైమ్‌లో ఎవరైనా గోల్డ్‌ గిఫ్ట్‌గా ఇస్తే పట్టరానంత ఆనందం కలుగుతుంది. కచ్చితంగా గిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తిది ‘గోల్డెన్‌ హార్ట్‌’ అనకుండా ఉండలేం. ‘మహానటి’ టీమ్‌ కీర్తీ సురేశ్‌ని అలానే అంటున్నారు. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మహానటి’లో కీర్తీ టైటిల్‌ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రియాంకా దత్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది.

సావిత్రి పాత్ర చేసే అవకాశం కెరీర్‌ ఆరంభించిన తక్కువ సమయంలో రావడం, ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం మంచి అనుభూతిని మిగల్చడంతో యూనిట్‌ సభ్యులకు బహుమతులు ఇవ్వాలనుకున్నారు కీర్తీ. దాదాపు 100 మందికి గోల్డ్‌ కాయిన్‌ బహుమతిగా ఇచ్చారని సమాచారం. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకూ ఆ కాయిన్‌ ఉంటుందట. 100 కాయిన్స్‌ అంటే 25 లక్షల వరకూ ఖర్చు పెట్టి ఉంటారు కీర్తి. ఈ సినిమాకి కీర్తి మనసులో ఎంత స్పెషల్‌ ప్లేస్‌ ఉందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు. అయినా బహుమతులు ఇవ్వాలని రూలేం లేదు. అయితే తన ఆనందాన్ని పంచుకోవడం కోసమే ఆమె ఇలా చేశారు. మేడమ్‌ మనసు బంగారం కదూ.

మరిన్ని వార్తలు