అదే చివరి చిత్రం!

16 Aug, 2019 07:50 IST|Sakshi

సినిమా: అదే చివరి చిత్రం అని ఖచ్చితంగా చెప్పేసింది నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ ఇప్పుడు అభినందనల సాగరంలో మునిగితేలుతోంది. కారణం మహానటి (తమిళంలో నడిగైయార్‌ తిలగం) చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డు వరించడమే. మహానటి సావిత్రినే వచ్చి పూనినట్లు ఆ చిత్రంలో జీవించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దానికి బోనస్‌గా ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో తమిళంలోనూ దర్శకుడు  కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మహానటి చిత్రంలో నటనకు గానూ జాతీయ అవార్డు లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది.  మరోసారి బయోపిక్‌ చిత్రాల్లో నటించేది లేదని చెప్పింది. సావిత్రి బయోపిక్‌నే తాను నటించిన తొలి, చివరి చిత్రం అవుతుందని అంది. ఆ మహానటి పాత్రలో నటించాక మరొకరి జీవిత చరిత్రలో నటించడం ఉత్తమమనిపించుకోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహానటి చిత్ర షూటింగ్‌ పూర్తి కాగానే ఏదో మనసును వదిలి వెళ్లిపోయిన ఫీలింగ్‌ కలిగిందని చెప్పింది. గుండె పగిలేలా ఏడ్చేశానని అంది.

ఆ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో యూనిట్‌ అంతా అంత మానసికంగా కలిసిపోయామంది. తాను హాలీవుడ్‌ నటుడు టామ్‌క్రూస్‌కు వీరాభిమానినని చెప్పింది. హిందీలో షారూఖ్‌ఖాన్, దీపికాపదుకోనే, అలియాభట్‌ చాలా ఇష్టం అని పేర్కొంది. కోలీవుడ్‌లో నయనతార డ్రెస్‌ సెన్స్, నటి సిమ్రాన్‌ డాన్స్‌ నచ్చుతాయని చెప్పింది. ఆ మధ్య ఒక షాప్‌ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అభిమాని ఇచ్చిన పార్శల్‌ని తెరిచిచూడగా తన ఫొటోలతో కూడి న అందమైన ఆల్బమ్, అందులో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ ఒక లేఖ ఉందని తెలిపింది. తనకు కళాశాల జీవితంలో తనకు ఎవరూ ప్రేమలేఖలు ఇవ్వలేదని, ఆ యువకుడు రాసిందే తొలి ప్రేమ లేఖ అని చెప్పింది. దీంతో ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్నట్లు కీర్తీసురేశ్‌ చెప్పింది. తాను ఎవరి ప్రేమలోనూ పడలేదని చెప్పిందీ భామ. నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ అంటోంది ఈ బ్యూటీ.

>
మరిన్ని వార్తలు