సండైకోళి–2 యూనిట్‌కు పసిడి పంట

25 Aug, 2018 11:28 IST|Sakshi
సండైకోళి–2 చిత్ర యూనిట్‌

తమిళసినిమా: సహ నటీనటులకు, సాంకేతిక వర్గానికి షూటింగ్‌ పూర్తి కాగానే బంగారు డాలర్లను కానుకగా అందించే సంప్రదాయానికి ఆనాటి మహానటి సావిత్రి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఎవరూ అలాంటి సంప్రదాయాన్ని పెద్దగా పాటించలేదు. అలాంటిది ఆ మహానటి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్‌ ఆమె గుణగణాలను పుణికిపుచ్చుకున్నారా?అన్నంతగా మహానటి చిత్ర షూటింగ్‌ పూర్తి కాగానే యూనిట్‌ అందరికీ బంగారు నాణేలను కానుకగా అందించారు. అదే సంప్రదాయాన్ని తన తాజా చిత్రం సండైకోళి–2 చిత్ర షూటింగ్‌ ముగింపు రోజునా కీర్తీసురేశ్‌ కొనసాగించారు. ఆ ఆనందం నుంచి బయట పడకుండానే తాజాగా అదే చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్, దర్శకుడు లింగుస్వామి యూనిట్‌ సభ్యులు 150 మందికి విడివిడిగా బంగారు నాణేలను కానుకగా అందించి సంతోషంలో ముంచెత్తారు. ఈ దర్శక నిర్మాతలకు నటి కీర్తీశురేశ్‌ స్ఫూర్తి అనిపించారేమో.

విశాల్‌ హీరోగా నటిస్తూ విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సండైకోళి–2. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా విశాల్, దర్శకుడు లింగుస్వామి చిత్ర యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కేరళా రాష్ట్ర వరద బాధితుల సహాయార్థం ఆ రాష్ట్ర ముఖ్యమంతి సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సండైకోళి–2 చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర సింగిల్‌ ట్రాక్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రం తమిళం, తెలుగు భాషల్లో అక్టోబరు 18న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు