'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌

28 Oct, 2019 17:46 IST|Sakshi

మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్‌ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. మన్మధుడు 2 లో అతిథి పాత్రలో మెరిసినా కేవలం రెండు సీన్లకే పరిమితమయ్యారు. ప్రముఖ దర్శకుడు కుకునూర్‌ నగేశ్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాఫ్‌ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ చిత్రానికి 'గుడ్‌ లక్‌ సఖి' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు.

గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన యువతి 10 మీటర్ల షూటింగ్‌ రైఫిల్‌లో తన ప్రతిభతో ఎలా వెలుగొందింది అన్న ఇతివృత్తంతో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్‌ రోల్‌లో కీర్తి సురేశ్‌ నటిస్తుండగా, జగపతిబాబు కోచ్‌గా కనిపించనున్నాడు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. సుధీర్‌ చంద్ర, శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తను వెడ్స్‌ మను' ఫేమ్‌ చిరంతన్‌ దాస్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం మేర షూటింగ్‌ జరుపుకుంది. సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్‌ను నవంబర్‌ 1నుంచి మొదలుపెట్టనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

మరిన్ని వార్తలు