రిస్క్‌ తీసుకున్నా

12 Apr, 2020 03:55 IST|Sakshi
కీర్తీ సురేష్

విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ‘ఇదు ఎన్న మాయమ్‌’ (2015) చిత్రంతో తమిళంలో, రామ్‌ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’ (2016) చిత్రంతో తెలుగులో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేష్‌. ‘మహానటి’ చిత్రంతో తనలో అద్భుత నటి ఉందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్‌ జోరుగా ఉంది. ఈ విషయం గురించి కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ –‘‘నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్‌లో రిస్క్‌ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను.

నేను ఓవర్‌నైట్‌ స్టార్‌ని కాలేదు. కానీ ఊహించనదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి ఫేమ్‌ వచ్చిందని మాత్రం చెప్పగలను. అలాగే ఇంత తక్కువ సమయంలో జాతీయ అవార్డు (‘మహానటి’ చిత్రానికి) సాధిస్తానని కూడా ఊహించలేదు. నేను చేసిందల్లా శక్తివంచన లేకుండా నా పాత్రలకు న్యాయం చేయడమే’’ అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కీర్తీ సురేష్‌. అలాగే ఇటు తెలుగు అటు తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖి, పెంగ్విన్‌ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు