కోలీవుడ్‌లో కనుమరుగైన కీర్తి

22 Jul, 2019 07:26 IST|Sakshi

సినిమా: చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాందించుకున్న నటి కీర్తీసురేశ్‌. మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినా, కోలీవుడ్, టాలీవుడ్‌లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తమిళంలో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. దీంతో విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తీసురేశ్‌ తన తల్లి కోరికను తీర్చేసింది. ఆమె తల్లి మేనక చాలా కాలం క్రితం రజనీకాంత్‌కు జంటగా నెట్రికన్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయింది. అలా తన తల్లి సాధించలేనిది కీర్తీసురేశ్‌ సాధించిందనే చెప్పాలి. ఇక తెలుగులో నేను శైలజా వంటి కొన్ని హిట్‌ చిత్రాల్లో నటించినా మహానటి చిత్రం నటిగా కీర్తీసురేశ్‌ స్థాయిని ఒక్క సారిగా పెంచేసింది.

ఇలా తమిళం, తెలుగు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా తెరమరుగైపోయింది. కారణం బాలీవుడ్‌ మోహమే నంటున్నారు సినీ వర్గాలు. హిందీలో నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం కోసం కసరత్తులు చేసి చాలా స్లిమ్‌గా తయారైంది. ఇంకా చెప్పాలంటే మేకప్‌ లేకుండా ఇది కీర్తీనా అని ఆశ్చర్యపడేంతగా సన్నపడింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల ఒక తెలుగు చిత్రాన్ని తిరష్కరించిందనే ప్రచారం జోరందకుంది. కారణం కథా పాత్ర నచ్చలేదని సాకు చెబుతున్నా, హిందీలో నిలదొక్కుకోవాలన్న ఆశతోనే కీర్తీసురేశ్‌ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు సినీ వర్గాలు. అంతే కాదు శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌తో బాగా దోస్తీ కుదిరిందట. ఎక్కువగా ముంబైలోనే మకాం పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. తమిళంలో అసలు ఈ బ్యూటీ పేరే వినిపించడం లేదు. ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. హిందీ చిత్రం పూర్తి అయ్యే వరకూ దక్షిణాది వైపు దృష్టి సారించే అవకాశం ఉండదనుకుంటా. అక్కడ అటూ ఇటూ అయితే ఆ తరువాత ఇక్కడ కీర్తీసురేశ్‌ను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయమే.  

మరిన్ని వార్తలు