జీప్సీలో సూపర్ స్పీడ్తో వచ్చి సడన్ బ్రేక్ వేసి, ఎంట్రీ ఇచ్చారు హీరో విక్రమ్. విలన్స్ వైపు కోపంగా చూశారు. ఇంకేముంది? వాయింపుడు షూరూ అయ్యింది. అయితే అది ఏ రేంజ్లో అనేది సిల్వర్ స్క్రీన్పై చూస్తేనే కిక్ వస్తుంది అంటున్నారు చిత్రబృందం. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలో 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్తోపాటు, కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ సమాచారం.
ఈ సినిమాకు వర్క్ చేస్తోన్న కెమెరామన్ ప్రియన్ గత నెలలో మరణించారు. ఆ ప్లేస్లో మరో కెమెరామన్ వెంకటేష్ను తీసుకున్నారు. ఈ సినిమాకి ‘స్వామి స్క్వేర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2003లో వచ్చిన ‘స్వామి’కి ఇది సీక్వెల్. ఈ సంగతి ఇలా ఉంచితే.. మరోవైపు విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న ‘స్కెచ్’ చిత్రం ఆడియోను డిసెంబర్ 15లోగా రిలీజ్ చేసి, చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.