చెన్నై : వృత్తి ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే ఫలం, ఆనందం ఉంటాయి అని చెప్పింది నటి కీర్తీసురేశ్. చాలా తక్కువ సమయంలోనే చాలా మంది కంటే మంచి నటిగా గుర్తింపు పొందిన సుందరి ఈమె. మాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసినా, పేరు మాత్రం టాలీవుడ్, కోలీవుడ్లోనే అన్నది వాస్తవం. తెలుగులో ఈ చిన్నది నటించిన మహానటి చిత్రంతో ఎంత ఎదిగిపోయిందో. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే పొందేసింది. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తీసురేశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ నేను ధరించిన దుస్తులు అందంగా ఉంటున్నాయి అంటున్నారు. అందుకు కారణం ఫ్యాషన్ డిజైనింగ్పై నాకున్న ఆసక్తినే. ఎవరు ఏ వృత్తిని చేసినా మనస్ఫూర్తిగా ప్రేమించి చేస్తే ఫలం, ఆనందం లభిస్తాయి. పనిని సంతోషంగా చేస్తే విజయాన్ని సాధించినట్లే. ప్రతిఒక్కరూ వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలి. నాలోని ప్రతిభను నిరూపించుకునే కథా పాత్రలను కోరుకుని నటిస్తున్నాను. అలాంటి పాత్రలనే ఆశిస్తున్నాను. తమిళం, తెలుగు భాషల్లో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నాను. సుస్థిరమైన స్థానం లభించింది.
కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన పాత్రలను సమర్థవంతంగా నటించగలననే పేరు పొందాను. ఇది సంతోషాన్ని కలిగిస్తోంది. నేను ఎంపిక చేసుకునే చిత్రాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు? కథేంటి? నా పాత్ర ఏమిటి? వంటి విషయాల గురించి తెలుసుకున్న తరువాతే అందులో నటించడానికి అంగీకరిస్తున్నాను. సినిమా కోసం సమష్టిగా శ్రమిస్తేనే విజయం పొందగలం. అందరూ ఒకే భావనతో పనిచేస్తేనే జయించగలం. తాను హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలతో పాటు కమర్శియల్ కథా చిత్రాల్లోనూ నటించాలను కోరుకుంటున్నాను అని నటి కీర్తీసురేశ్ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో పెన్గ్విన్ అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా త్వరలో సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి నటించడానికి సిద్ధం అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఈ సక్కనమ్మ చాలా చిక్కి మరింత నాజూగ్గా తయారైంది. బహుశా హిందీ చిత్రం కోసం అలా బాగా కసరత్తులు చేసి సన్నబడినట్లుంది.