ఇళయదళపతి విజయ్తో నటి కీర్తీసురేశ్ మూడోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఆ మధ్య మహానటి చిత్రంలో నటి సావిత్రిగా ఒదిగిపోయిన కీర్తి ఆ తరువాత సర్కార్, సండైకోళి –2, సామి స్క్వేర్ వంటి కమర్షియల్ చిత్రాలను వరుసగా చేసి కాస్త విరామం కావాలి బాస్ అని చెప్పింది. అయితే దర్శక నిర్మాతలు ఆమెకు ఆ అవకాశం కూడా ఇచ్చినట్లులేదు. ఇప్పటికే ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే ఒక తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపింది.
రాజమౌళి తాజా మల్టీస్టారర్ చిత్రంలో కీర్తి ఒక నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కోలీవుడ్లో సర్కార్ తరువాత చిన్న గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ వరుసగా అవకాశాలు కీర్తీసురేశ్ తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించే అవకాశం కీర్తిని వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా మరోసారి నటుడు విజయ్తో రొమాన్స్ చేసే అవకాశం కీర్తీకి దక్కనుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ బ్యూటీ ఇప్పటికే విజయ్తో భైరవ, సర్కార్ చిత్రాల్లో జతకట్టిన విషయం తెలిసిందే. తాజాగా అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 63వ చిత్రంలో కీర్తీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఇప్పటికే అగ్ర నటి నయనతార నాయకిగా ఎంపికైన విషయం తెలిసిందే. అట్లీ చిత్రాల్లో ఒకరికంటే ఎక్కువ హీరోయిన్లు ఉంటారు. మెర్శల్ చిత్రంలో సమంత, కాజల్అగర్వాల్, నిత్యామీనన్ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా తెరి చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ నటించారు. తాజా చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, వారిలో నయనతారను ఎంపిక చేయగా మరో ఇద్దరు కోసం కీర్తీసురేశ్, ఆద్మికలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో పరియేరుమ్ పెరుమాళ్ చిత్రం ఫేమ్ కదిర్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. ఇది క్రీడా నేపథ్యంలో సాగే కథాచిత్రంగా ఉండబోతోందని, ఇందులో విజయ్ మహిళా ఫుట్బాల్ క్రీడాకారుల శిక్షకుడిగా నటించనున్నారని సమాచారం.