నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

13 Aug, 2019 09:48 IST|Sakshi

వరుస విజయాలతో లేడీ సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిన నటి నయనతార. లేడీ ఓరియన్‌టెడ్‌ సినిమాల హీరోయిన్‌గా వెలిగిపోతున్న నయనతారకు ఇటీవల విజయాలు దూరం అవుతున్నాయి. ఈ ఏడాది విశ్వాసం చిత్రం ఒక్కటే నయనతార లిస్ట్‌లో పడ్డ హిట్‌. అయితే ఫ్లాప్‌లు మాత్రం వరుసగా మూడు పడ్డాయి.  ఐరా, కొలైయుధీర్‌ కాలం,  మిస్టర్‌ లోకల్‌ చిత్రాలు బోల్తా పడ్డాయి.

కొలైయుధీర్‌ కాలం చిత్రం నయనతారను చాలా నిరాశ పరిచింది.  దీంతో నయనతార ఖాతాలో వరుసగా మూడో ఫ్లాప్‌గా కొలైయుధీర్‌ కాలం చిత్రం నిలవక తప్పలేదు.  అయితే నయనతార విజయాలకు దూరం అయినా, అవకాశాలకు దూరం కాలేదు. ఇప్పుడామే చేతిలో మూడు, నాలుగు భారీ చిత్రాలు ఉన్నాయి. విజయ్‌కు జంటగా నటిస్తున్న బిగిల్, రజనీకాంత్‌ సరసన నటిస్తున్న దర్భార్‌ చిత్రంతో పాటు తెలుగులో చిరంజీవితో జతకట్టిన సైరా నరసింహారెడ్డి చిత్రాలతో పాటు మరో కొత్త చిత్రం ఉంది.

అయితే వీటిలో హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రం లేకపోవడం గమనార్హం.  ఇకపోతే ఇప్పుడు ఈ అమ్మడిపై కీర్తీసురేశ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం నయనతార నటించిన కొలైయుధీర్‌ కాలం చిత్ర ప్రచారంలో భాగంగా ఆ చిత్ర పోస్టర్లపై  నడిగైయార్‌ తిలగం(మహానటి) సావిత్రికి సవాల్‌ విసిరే నయనతార నటన అని పేర్కొన్నారు.

దీంతో ఇటీవలే నడిగైయార్‌ తిలగం చిత్రంకు గానూ  నటి కీర్తీసురేశ్‌ జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార చిత్రంపై అభిమానులు ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్నారు. సావిత్రి నటనకు ధీటుగా అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చేస్తుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు సామెత గుర్తుకొస్తుంది కదూ!

మరిన్ని వార్తలు