నా దృష్టిలో సినిమాలూ రాజకీయాలూ ఒక్కటే

2 Jun, 2019 00:47 IST|Sakshi
‘శశిలలిత’ పోస్టర్‌, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి

– కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి

లక్ష్మీస్‌ వీరగ్రంథం, శశిలలిత... ఈ మధ్య చర్చల్లో నిలిచిన చిత్రాల్లో ఈ రెండూ ఉన్నాయి. ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ విడుదలకు రెడీ అవుతోంది. ‘శశిలలిత’ షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకూ కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి  దర్శక–నిర్మాత. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ‘శశిలలిత’ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి చెప్పిన విశేషాలు.

► రెండు వివాదాస్పద సినిమాలను నిర్మించాలనుకున్నప్పుడు ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి మీకు బెదిరింపులు ఉండవా?
భారత రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, కొన్ని సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్‌ని ఆధారం చేసుకుని ఈ చిత్రకథలను తయారు చేసుకున్నాం. మాకు ఎవరూ శత్రువులు లేరు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని శత్రువులు అనుకుంటే వాళ్లను చట్టపరంగా ఎదుర్కొంటాం. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.

► మీరు చేసే సినిమాల్లో కొన్ని విడుదల కావు. సినిమాలను ప్రారంభిస్తారు.. కానీ విడుదల చేయరనీ, కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతారని చాలామందికి మీ మీద ఓ అభిప్రాయం ఉంది..
నేను గతంలో రజనీకాంత్, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలని ప్రయత్నించింది నిజమే. కానీ, అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పెద్ద కాంబినేషన్లు కదా.. మనం అనుకున్నవన్నీ సమయానికి జరగవు. అలాగే మనం చేసే ప్రయత్నాలన్నీ జరగాలని లేదు కదా.

► ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రాన్ని ముందు మీరే నిర్మించి, తర్వాత వేరే నిర్మాతకు ఇవ్వడానికి కారణం?
‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ అనే సినిమాని నావంతు బాధ్యతగా నిర్మించాను. అయితే బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీనిర్మాత నా వద్ద నుంచి ఆ ప్రాజెక్టుని సొంతం చేసుకున్నారు. ఆ సినిమాకి ఇప్పుడు నేను కేవలం దర్శకుణ్ణి మాత్రమే. ఇక సినిమా విడుదల చేయడమంటారా ఆయన ఇష్టానికే వదిలేశా. ఇప్పుడు అది నా చేతుల్లో లేదు.

► సినిమా రంగంలో ఉంటూనే తమిళనాడులో తెలుగు భాష వికాసానికి పోరాడారు. మీకు ప్రజాసేవ అంటే ఇష్టమా? సినిమా అంటే ఇష్టమా?
సినిమాల, రాజకీయాల దృక్పథం ఒక్కటే. సినిమాల్లో డబ్బు పోయినా, రాజకీయాల్లో డబ్బు ఖర్చు అయినా సంతృప్తి చెందుతాం. ఎందుకంటే ప్రజలకు దగ్గరవుతాం. కాబట్టి ఈ రెండు రంగాలు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను.

► మీ రాజకీయ పయనంలో మీకు నచ్చిన నాయకుడు?
‘తాను గెలిచే వరకు.. తాను ఓడిపోలేదు’ అని అనుకున్నవాడే నాయకుడు. నిరంతరం లక్ష్యం దిశగా పోరాటాలు సాగించడం వంటి గొప్ప రాజకీయ లక్షణాలను స్వర్గీయ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డిగారు, వారి కుమారుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిగారిలో చూశాను. కేసీఆర్‌గారిలోనూ ఈ లక్షణాలు ఉన్నాయి. రాజకీయాల్లో వారే నాకు మార్గదర్శకులు, స్ఫూర్తి. రాజశేఖర రెడ్డిగారు 25 సంవత్సరాల పోరాటం తర్వాత జయాన్ని పొందారు. అదే విధంగా వారి కుమారుడు జగన్‌గారు పదేళ్ల పోరాటం తర్వాత అద్భుతమైన విజయం అందుకున్నారు. అందుకే నిత్యం పోరాడే వారంటే నాకు ఇష్టం.

మరిన్ని వార్తలు