క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

31 Jul, 2019 10:13 IST|Sakshi

చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్‌తో సాలిడ్‌ హిట్‌ కొట్టాడు. మాస్‌ మసాలా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల మార్క్‌ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పూరి జగన్నాథ్‌ తన తదుపరి చిత్రాన్ని ఓ క్రేజీ స్టార్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కేజీఎఫ్‌ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యష్‌తో పూరి తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కన్నడ హీరోలు పునీత్ రాజ్‌కుమార్‌, ఇషాన్‌ల తొలి చిత్రాలకు దర్శకత్వం వహించిన పూరి, సాండల్‌వుడ్‌కు సుపరిచితుడే. అందుకే యష్‌ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్యువల్‌ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట పూరి. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించాలనుకున్న జనగణమన సినిమానే యష్‌ హీరోగా రూపొందించే ఆలోచనలో పూరి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై పూరి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

మరిన్ని వార్తలు