కార్తీ ఏడాదికో తెలుగు సినిమా చేయాలి

4 Nov, 2017 01:07 IST|Sakshi

‘రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తీక్‌ వంటి హీరోలు తెలుగులో చాలా మంచి సినిమాలు చేశారు.  కార్తీ కూడా సంవత్సరానికి ఒక తెలుగు స్ట్రైట్‌ సినిమా చెయ్యాలి. అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. కార్తీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా వినోద్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ తమిళంలో నిర్మించిన చిత్రం ‘ధీరన్‌ అధికారమ్‌ ఒండ్రు’. ఈ సినిమాని ‘ఖాకి’ పేరుతో ఆదిత్య మ్యూజిక్‌ అధినేతలు ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

జిబ్రాన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘పోలీస్‌ పాత్రలు హీరోలకి ఛాలెంజింగ్‌గా ఉంటాయి.  ‘నా పేరు శివ’, ఊపిరి’ సినిమాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆదిత్య మ్యూజిక్‌ అధినేతలు ‘ఖాకి’తో నిర్మాతలుగా మారుతుండటం సంతోషం’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘పోలీస్‌ పాత్రల్లో రెండు సినిమాలు చేశా. దర్శకుడు వినోద్‌ చెప్పిన కథ వినగానే చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. చాలా మంది పోలీసాఫీసర్స్‌ని కలిశాను. 1995 నుంచి 2005 వరకూ జరిగిన ట్రూ స్టోరీ ఇది. ఇప్పటివరకు వచ్చిన పోలీస్‌ స్టోరీస్‌ కంటే డిఫరెంట్‌గా ఉంటుంది.

ఈ నెల 17న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హిందూయిజం, ఎడ్యుకేషన్, పోలీస్‌ డిపార్ట్‌మెంట్స్, ్రౖకైమ్‌.. ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు వినోద్‌. ‘‘ఖాకి’ నాకు స్పెషల్‌ మూవీ. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు రకుల్‌. నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, శివలెంక కృష్ణప్రసాద్, కె.అచ్చిరెడ్డి, పి.కిరణ్, లగడపాటి శ్రీధర్, శైలేంద్రబాబు, దర్శకులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ఎన్‌.శంకర్, కెమెరామెన్‌ సత్యం తదితరులు పాల్గొన్నారు.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శ్రీధర్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు