తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు – కార్తీ

27 Nov, 2017 01:17 IST|Sakshi

‘‘తెలుగు ప్రేక్షకులకు నేను ‘ఆవారా’ కార్తీ, ‘ఊపిరి’ శ్రీనుగా గుర్తుండి పోయా. కానీ, ఈ ‘ఖాకి’ నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. నా గత చిత్రాలతో పోల్చితే తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన చిత్రమిది. ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖాకి’. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘వినోద్‌గారి స్క్రీన్‌ప్లేను అందరూ అభినందిస్తున్నారు.

ఇంటర్వెల్‌ బ్లాక్‌ చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యారు. ఈ సినిమాతో చాలా మందిలో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడింది. నా భార్య కూడా పోలీసులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. మా సినిమాను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళంలో ‘ఖాకి’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు రకుల్‌. ‘‘నిర్మాతలుగా మా తొలి చిత్రమిది. సినిమా రెండోవారంలోకి ఎంటర్‌ అయినా పాజిటివ్‌ టాక్‌ ఉంది. కలెక్షన్స్‌ బాగున్నాయి’’ అన్నారు సుభాష్‌ గుప్తా. సహ నిర్మాత శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు