'నా సినీ ప్రస్థానం ముగిసింది'

24 May, 2015 19:19 IST|Sakshi
'నా సినీ ప్రస్థానం ముగిసింది'

తిరువనంతపురం: తన సినీ ప్రస్థానం ఇక ముగిసిందని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా మారిన ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైందని ఆరోపించారు. సాటి మహిళగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను ఆమోదిస్తానని, కానీ ఆమె అహంకారాన్ని మాత్రం తాను అంగీకరించలేనని చెప్పారు. 'నాపిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నాను.

ఇప్పుడు నటన మీద దృష్టి పెడితే పార్టీకి సంబంధించిన సమావేశాలకు హాజరయ్యేందుకు ఇబ్బంది అవుతుంది. సినిమాలకు ఒప్పుకుని నిర్మాతలను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇక నా సినీ జీవితానికి ముగింపు పలికే సమయం వచ్చినట్లేనని చెప్పగలను' అని ఆమె ఆదివారం మీడియాకు తెలిపారు.  ఇక మోదీ సర్కార్పై ఆమె విమర్శలు గుప్పిస్తూ.. పేదలు, రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయని, ఈ రెండు కారణాలు చాలు మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి అంటూ ఆమె విమర్శించారు. ఆయన పాలనలో పేదవారు నిరు పేదవారిగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆరోపించారు.