గాసిప్స్‌ను కొట్టేసిన కియారా అద్వానీ

29 Mar, 2019 16:00 IST|Sakshi

తాను ఎవరితోనూ ప్రేమలో లేనని ప్రముఖ హీరోయిన్‌ కియారా అద్వానీ స్పష్టం చేసింది. బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో తాను ప్రేమాయణం సాగిస్తున్నానంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. ‘నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. నాపై వస్తున్న వార్తల్లో అవాస్తవాలే’ అని కియారా కొట్టిపారేసింది. ఇదే విషయాన్ని కాఫీ విత్‌ కరణ్‌ షోలో కరణ్‌ జోహర్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా వద్ద ప్రస్తావించగా.. పని తప్ప తనకింకేదీ సంతోషాన్నివ్వదని అతను  సమాధానమిచ్చాడు.

‘కియారాతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. పత్రికల్లో నాపై వచ్చే రూమర్ల గురించి నాకు తెలియదు. నా జీవితం మీరనుకుంటున్నట్టు రంగులమయం కాదు. నిజజీవితంలో నాకుండే ఆనందాలు చాలా  తక్కువ’’ని చెప్పుకొచ్చాడు. ఒకపైపు తమ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీలు చెబుతుండగా.. సిద్ధార్థ్‌ మాజీ ప్రేయసి ఆలియా భట్‌ మాత్రం కియారాతో అతడు డేట్‌కు వెళ్తే బాగుంటుందని చెప్పడం విశేషం. భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించిన అందాల భామ కియారా అద్వానీ.. కళంక్, అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్‌ సింగ్, అక్షయ్‌ కుమార్‌ ‘గుడ్‌ న్యూస్‌’ తదితర సినిమాల్లో నటిస్తోంది.

మరిన్ని వార్తలు