అలియాస్‌ ప్రీతి

26 Sep, 2018 01:31 IST|Sakshi

బాలీవుడ్‌లో ఇప్పుడందరూ కథానాయిక కియారా అద్వానీని ప్రీతీ.. ప్రీతీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె నెక్ట్స్‌ సినిమాలో ప్రీతి అనే క్యారెక్టర్‌ చేయబోతున్నారు. తెలుగులో సూపర్‌హిట్‌ సాధంచిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలో రీమేక్‌ అవ్వనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. తెలుగులో హీరో విజయ్‌ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్‌ చేయనున్నారు.

అలాగే హీరోయిన్‌ షాలిని పాండే రోల్‌ (ప్రీతి)ను ఫైనల్‌గా కియారా అద్వానీ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టీమ్‌. ‘‘హిందీ ‘అర్జున్‌రెడ్డి’కి హీరోయిన్‌ దొరికింది. కియారా అద్వానీ అలియాస్‌ ప్రీతికి స్వాగతం’’ అని షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు. ‘‘వన్నాఫ్‌ మై ఫెవరెట్‌ ఫిల్మ్స్‌లో ‘అర్జున్‌రెడ్డి’ కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీక్రియేట్‌ చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. అమేజింగ్‌ టీమ్‌ కుదిరింది. ఈ సినిమాలోని హీరోయిన్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నాయి. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు కియారా. ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెల ప్రారంభం అవుతుందని బాలీవుడ్‌ టాక్‌. 

మరిన్ని వార్తలు