నా ఓపికను పరీక్షించొద్దు : హీరో

22 Sep, 2019 07:07 IST|Sakshi

బెంగళూరు : ‘నేను, నా స్నేహితులు చేతికి వేసుకునేది కంకణం. గాజులు కాదు’ అని బహుభాషా నటుడు కిచ్చ సుదీప్‌ ప్రకటించారు.తనపైన కుట్రలు చేస్తున్నవారు ఇంక కొన్నిరోజులు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోతారని, మరోసారి ట్విట్టర్లో గొడవల జోలికి రావద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. ప్రస్తుతం శ్యాండల్‌వుడ్‌లో జరుగుతున్న స్టార్‌వార్‌ తీవ్రస్థాయికి చేరడంతో సుదీప్, మరో హీరో దర్శన్‌ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్‌ మీడియా యుద్ధం ఆ తారలనూ తాకింది. సుదీప్‌ హీరోగా తాజాగా విడుదలైన పైల్వాన్‌ సినిమాను వీరేష్‌ అనే యువకుడు ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు తాను హీరో దర్శన్‌ అభిమానిని అని ప్రకటించుకున్నాడు.  

మా శ్రమను వృథా చేస్తున్నారు  
తన సినిమా నెట్లోకి రావడంతో సుదీప్‌ ట్విట్టర్లో భగ్గుమన్నారు. ‘నాకు సినిమాలు వదిలేస్తే మరో పని ఏమీ లేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నా మౌనానికి పరీక్ష పెడుతున్నారు. ఇంత మంచి సినిమాను సోషల్‌ మీడియాలో పెట్టడం ద్వారా తననే కాదని పైల్వాన్‌ సినిమా కుటుంబసభ్యులు పడిన కష్టం మొత్తం వృథా చేస్తున్నారు. దీని వెనకల ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. ప్రస్తుతం వారు ప్రశాంతంగా నిద్రపోతుండవచ్చు. కానీ ముందురోజుల్లో నిద్రపోనివ్వను’ అని హెచ్చరించారు. పైల్వాన్‌ వీడియోలను పెట్టి సినిమా కలెక్షన్లను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇరు హీరోల అభిమానులు పరస్పరం సోషల్‌ మీడియాలో విమర్శలకు దిగుతున్నారు. అభిమానులకు మద్దతుగా హీరోలు కూడా యుద్ధంలోకి దిగితే శాండల్‌వుడ్‌కు సెగలు తప్పవు. 

మరిన్ని వార్తలు