‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

14 Aug, 2019 18:23 IST|Sakshi

ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా సిద్ధమవుతోంది.  బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌, విద్యాబాలన్‌, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్‌ మంగళ్‌’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్‌ మిషన్‌ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.  జగన్‌ శక్తి దర్శకత్వంలో ఆర్‌ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్‌ టాక్‌ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. 

ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్‌ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్‌ కుమార్‌, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్‌తో కలిసి ‘మిషన్‌ మంగళ్‌’ ప్రివ్యూ చూడటం అమేజింగ్‌గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు