మహిళల గురించి చెప్పే సినిమా

7 Mar, 2019 02:41 IST|Sakshi
హరితేజ, సుమన్‌ రంగనాథ్, భాగ్యశ్రీ, దీప్తీ భట్నాగర్, మధుబాల, సదా, పూజా ఝవేరి

‘మైనే ప్యార్‌ కియా’ (‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్యశ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్, ‘జయం’ ఫేమ్‌ సదా, సుమన్‌ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి, హర్షవర్ధన్‌ రాణే ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘కిట్టిపార్టీ’. ఈ సినిమాతో సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

సుందర్‌ పవన్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీమేల్‌ బడ్డీ డ్రామా. అలాగని మహిళలకు సంబంధించిన సినిమా కాదు. కానీ, సినిమాలో  మహిళలే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. ఏ సినిమాకూ రీమేక్‌ కాదు. ఆరుగురు మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. భోగేంద్ర గుప్తా లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అతిత్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన నటీనటులకు థ్యాంక్స్‌’’ అన్నారు భోగేంద్ర గుప్తా. ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్‌ చేయడమే పురుషులకు కష్టమైన పని.

మా దర్శకుడు సెట్‌లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్‌ చేయాలి’’ అన్నారు భాగ్యశ్రీ (నవ్వుతూ). ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్‌ చేసే ఇండస్ట్రీలో.. హీరో లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఈ చాన్స్‌ ఇచ్చినందుకు పవన్, గుప్తాగారికి థ్యాంక్స్‌’’ అన్నారు మధుబాల. ‘‘మహిళల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు సదా. ‘‘20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దీప్తీ భట్నాగర్‌. సుమన్‌ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, కెమెరా: సాయిశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి.

మరిన్ని వార్తలు