తారల టాట్టూ మోజు

17 Aug, 2014 00:54 IST|Sakshi
తారల టాట్టూ మోజు

 తమిళ సినిమా నటీమణులు పలువురు పచ్చబొట్లు (టాట్టూస్) పొడిపించుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమ దేహాలపై వివిధ డిజైన్లలో వీటిని పొడిపించుకుంటున్నారు. త్రిష ఇప్పటికి మూడు సార్లు పచ్చ పొడిపించుకున్నారు. మొట్టమొదట ‘నెమో’ అనే కార్టూన్ చేపను పచ్చ పొడిపించుకున్నారు. నయనతార తన వీపుపై తేలును, చేతిపై ప్రభు అనే పేరును పొడిపించుకున్నారు. నమిత తన వీపుపై డిజైన్‌ను రూపొందించుకోగా, రీమాసేన్ ఉదర భాగంలో పక్షిని పచ్చ పొడిపించుకున్నారు.
 
 తమన్నా, కాజల్ అగర్వాల్, అసిన్, ప్రియమణి వంటి ప్రముఖ తారలు పలువురు తమకు నచ్చిన వాటిని ఒంటిపై పచ్చపొడిపించుకుంటున్నారు. శ్రుతిహాసన్ ఇదివరకే తన పేరును తమిళంలో వీపుపై చిత్రించుకున్నారు. ఆ తర్వాత తన చేతిపై రోజా పువ్వును పొడిపించుకున్నారు. కాలిపైనా టాట్టూ వేయించుకున్నారు. ప్రస్తుతం ఐదో సారిగా చేతిపై పచ్చ పొడిపించుకున్నారు. గతంలో కుష్బు, స్నేహ, సిమ్రాన్‌లు పచ్చ పొడిపించుకున్నవారే!
 
 తాజాగా తాప్సీ
 నటి తాప్సీ తన నడుముకు వెనుకవైపు టాట్టు పొడిపించుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తారల్లో టాట్టూ సంస్కృతి నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కథానాయికల్లో ఈ పైత్యం పెరిగిపోతోంది. చేతులు, కాళ్లు, నడుము, వీపు భాగం, గుండెలపైనా రకరకాల టాట్టూలను వేయించుకుంటున్నారు. అభిమానులు, ఇతర చిత్ర ప్రముఖుల దృష్టిని తమ వైపు మళ్లించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 తాజాగా నటి తాప్సీ తన నడుము వెనుకవైపు టాట్టూ వేయించుకుని వార్తల్లో కెక్కారు. దీని గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇంతకుముందు కళ్లపై, కాళ్లపై టాట్టు వేయించుకున్నానని, ఇప్పుడు నడుము కింద భాగంలో టాట్టూ వేయించుకున్నట్టు తెలిపారు. అక్కడ పొడిపించుకోవడానికి కారణం ఈ భాగంలో టాట్టును తరచూ చూడటం సాధ్యం కాదన్నారు. ఇంతకు ముందు వేయించుకున్న టాట్టూలను చూసి చూసి బోర్ కొట్టిందన్నారు. అందువలనే తాను నడుము కింది భాగంలో టాట్టు పొడిపించుకున్నట్లు వివరించారు.