ఆ రియాక్షన్‌ మాకు ఆక్సిజన్‌

18 May, 2020 00:44 IST|Sakshi
కోన వెంకట్‌

‘‘సినిమాలను థియేటర్స్‌లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్‌. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్‌. థియేటర్స్‌లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్‌ చేశారు కోన వెంకట్‌.

ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడసన్‌ ప్రధాన తారాగణంగా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్‌ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్‌లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు.

మరిన్ని వార్తలు