జేబు శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇంకా రాలేదు

28 Aug, 2018 00:31 IST|Sakshi
కోన వెంకట్, రితికా, ఆది పినిశెట్టి, హరినాథ్‌

కోన వెంకట్‌

‘‘నీవెవరో’ టీమ్‌ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్‌ శాటిస్‌ ఫ్యాక్షన్‌ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్‌ ఫ్యాక్షన్‌ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్‌ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా హరినాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్‌షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్‌ అయినా కూడా... హౌస్‌ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్‌ మార్చి ఎంవీవీ బ్యానర్‌ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్‌ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం.

రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్‌ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్‌ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్‌ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్‌. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు