మాది తొలి హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ చిత్రం

25 Aug, 2019 04:34 IST|Sakshi
హేమంత్, అనుష్క, కోన వెంకట్, షానీల్‌

– కోన వెంకట్‌

‘‘హాలీవుడ్‌ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్‌ నటీనటులు కాంబినేషన్‌లో వస్తున్న తొలి ‘క్రాస్‌ఓవర్‌’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్‌ ఓవర్‌ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్‌ టైమ్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. సెప్టెంబర్‌లో టీజర్‌ రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్‌. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నిశ్శబ్దం’.

ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘కిల్‌బిల్‌’ సినిమాలో విలన్‌గా నటించిన మైఖేల్‌ మ్యాడిసన్‌తో పాటు 7–8 మంది హాలీవుడ్‌ నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్‌కి అమెరికన్‌ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. గ్రాఫిక్స్‌కి స్కోప్‌ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్‌లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు