రెండు ఊళ్ల గొడవ

8 Nov, 2019 00:55 IST|Sakshi
రేయాన్‌ రాహుల్, అనిల్‌ మొగిలి

అనిల్‌ మొగిలి, రేయాన్‌ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో కేబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్‌ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే నిజాయతీగా, కష్టపడి సినిమా తీసినట్లు తెలుస్తోంది.  నేను సినిమా నిర్మించేందుకు హీరోల కోసం వెతుకుతున్నా.

మా బడ్జెట్‌కు తగిన హీరోలు దొరకడం లేదు. చిన్న చిత్రాల ద్వారానే కొత్త హీరోలు వచ్చే అవకాశముంది’’ అన్నారు. ‘‘టైటిల్‌లో ఉన్నట్లు ఇది కోనాపురంలో జరిగే కథ కాదు. రెండు ఊళ్ల మధ్య గొడవల నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీగా సాగుతుంది’’ అన్నారు కేబీ కృష్ణ. ‘‘వాస్తవ సంఘటనలతో రాసిన కథ కావడంతో ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యా’’ అన్నారు మచ్చ వెంకట్‌ రెడ్డి. ‘‘మా నాలుగేళ్ల కల ఈ సినిమా. యువతరం మెచ్చే వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశాన్ని జోడించాం’’అని పల్లె వినయ్‌కుమార్‌ అన్నారు. నిర్మాత ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఈరుపుల శ్రీకాంత్‌.

మరిన్ని వార్తలు