నీ కన్ను నీలి సముద్రం

3 Mar, 2020 01:18 IST|Sakshi
సుకుమార్, వైష్ణవ్‌ తేజ్, కొరటాల శివ, బుచ్చిబాబు

వైష్ణవ్‌ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం..’ అనే పాటను డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్‌ అలీ ఆలపించారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘ఈ వేసవికి ‘ఉప్పెన’ కంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం.

బుచ్చిబాబు కథ చెప్పిన విధానం చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననిపించింది. నాకు తెలిసి ఇంత చక్కని పల్లెటూరి ప్రేమ కథ ఈ మధ్య కాలంలో రాలేదు. నాకు బాగా స్ఫూర్తినిచ్చిన ‘సీతాకోకచిలక’ లాంటి అనుభూతి ఉన్న సినిమా ఇది. వైష్ణవ్‌ తేజ్‌కు ఇంతకంటే బెటర్‌ డెబ్యూ రాదనుకుంటున్నా. ‘ఉప్పెన’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ఏప్రిల్‌ 2న ‘ఉప్పెన’ సినిమాని విడుదల చేయడానికి నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సుకుమార్, వైష్ణవ్‌ తేజ్, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అనిల్‌ వై., అశోక్‌ బి, సీఈఓ: చెర్రీ.

మరిన్ని వార్తలు