క్రిష్ నిర్మాతగా తెలుగు సినిమా

19 Aug, 2014 23:35 IST|Sakshi
క్రిష్ నిర్మాతగా తెలుగు సినిమా

సమకాలీన సమస్యలను కథావస్తువులుగా చేసుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్). గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలతో తెలుగు చిత్ర సీమలోని మంచి దర్శకుల్లో స్థానం సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్‌లో ‘గబ్బర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేయడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.
 
ఇదిలావుంటే... ఈ సినిమాకంటే ముందు నిర్మాతగా ఓ చిత్రం చేయడానికి క్రిష్ సమాయత్తమయ్యారు. ఇందుకోసం తమిళంలో విజయం సాధించిన ‘శైవం’ సినిమా హక్కులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. బుల్లితెర దర్శకుడైన మలినేని రాధాకృష్ణను ఈ సినిమా ద్వారా తెరకు పరిచయం చేస్తున్నారు క్రిష్.