హీరోగానే కాక నిర్మాతగానూ సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా సెలెక్టివ్గా ఉంటున్నాడు. గతంలో మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ, ధృవ సినిమాతో ప్రయోగాల బాట పట్టాడు. ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త తరహా కథలకు సై అంటున్నాడు. ధృవ, ఖైదీ నంబర్ 150 సినిమాల పనులు ముగియటంతో ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టిపెట్టాడు చరణ్, ఈ నెల 30న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు.
సుకుమార్ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అది కూడా జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో క్రిష్, వరుణ్ హీరోగా 'రాయభారి' అనే సినిమాను చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. సూపర్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తరువాత తెలుగులో బాండ్ క్యారెక్టర్లలో నటించిన నటులు లేరు. ఇన్నేళ్ల తరువాత చరణ్ బాండ్ పాత్రలో కనిపిస్తాడన్న వార్తతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.