కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

6 Apr, 2020 16:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచమంతా కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ నటులు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా కృష్ణంరాజు కుటుంబం పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించడానికి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు.

అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి  మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును  అధిగమించడానికి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ మందున్నారు. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు