మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది – ‘దిల్‌’ రాజు

2 Apr, 2018 00:36 IST|Sakshi
మేర్లపాక గాంధీ, రుక్సార్, అనుపమా పరమేశ్వరన్, నాని, హిప్‌ హాప్‌ తమిళ, ‘దిల్‌’ రాజు

‘‘బాహుబలి’ ఫంక్షన్‌ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వేడుక తిరుపతిలో జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ కాబోతున్నాడు. నాకు, నానీకి పోటీ జరుగుతోంది. ఇద్దరం వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్‌ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కృష్ణార్జున యుద్ధం’.

వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ‘దిల్‌’ రాజు సినిమా ట్రైలర్‌ను, ఫస్ట్‌ టికెట్‌ను ఆవిష్కరించారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలకే నానీగారు ఓకే చెప్పేశారు. చిత్తూరు యాసను ఆయన చాలా ఈజీగా పలకడం గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి, రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. హిప్‌ హాప్‌ తమిళ మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు.

నాని మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతివాడే. గాంధీని చూస్తే సొంత సోదరునిలా అనిపించేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్‌ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్, చిత్ర సంగీతదర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ, తిరుపతి ప్రసాద్, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ,  ప్రశాంతి, మౌర్య, ప్రభాస్‌ శ్రీను, ఫైట్‌ మాస్టర్స్‌ జాషువా, ఆర్‌.కె, డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు