సునీల్ పాత్ర కొత్తగా ఉంటుంది : ‘దిల్’ రాజు

10 Jan, 2016 23:07 IST|Sakshi
సునీల్ పాత్ర కొత్తగా ఉంటుంది : ‘దిల్’ రాజు

 ‘‘మాకు సినిమా అనేది పెద్ద వీక్‌నెస్. దాన్ని సక్సెస్ చేయాలన్నది మరో వీక్‌నెస్. మా కోసం కాకున్నా దర్శకుడు వాసూ వర్మ కోసం ఈ చిత్రం సక్సెస్ కావాలి. మా సంస్థ నుంచి మంచి సక్సెస్ ఇచ్చి పంపించాలను కుంటున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే కాంబినేషన్‌లో వాసూ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. దినేష్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రాజమండ్రిలో విడుదల చేశారు.
 
  ముఖ్య అతిథులు, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సీడీలను ఆవిష్కరించారు. ‘‘ఇందులో సునీల్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి 5న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘రాజుగారింట్లో నేను పుట్టాను అనేంత రేంజ్‌లో ఈ సినిమా తీశారు. ఆయన రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. నన్ను చూసేందుకు ఇంతమంది వస్తారని ఊహించలేదు. ఛోటా కె.నాయుడు, వాసూ వర్మ గారు చూపించినంత అందంగా నన్నెవరూ చూపించ లేదు’’ అని సునీల్ పేర్కొన్నారు.
 
  ‘‘సునీల్‌తో వంద సినిమాలు తీసినా బోర్ కొట్టదు. సినిమా తీయడం ఇంత ఈజీనా అని ఈ చిత్రం తీసిన తర్వాత అనిపించింది. దినేష్ కొత్తవాడైనా అద్భుతమైన పాటలి చ్చాడు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ ‘దిల్’ రాజుగారి సినిమాల్లో ది బెస్ట్ ఆడియో ఇది. ఈ చిత్రం చూస్తే హిందీ సినిమా చూశామా అనే అనుభూతి కలుగుతుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిక్కి గల్రాని, డింపుల్ తదితరులు మాట్లాడారు.