ఉప్పెనతో ఎంట్రీ

19 May, 2019 05:33 IST|Sakshi
కృతీ శెట్టి

తెలుగు వెండితెరపై విజృంభించిన కన్నడ తారల్లో అనుష్క ముందు వరుసలో ఉంటారు. అనుష్క అంత కాకపోయినా మరో కన్నడ భామ ప్రణీత కూడా ఇక్కడ కొంచెం పేరు సంపాదించుకున్నారు. అనుష్క బొమ్మాళీగా ఫేమస్‌ అయితే ‘అమ్మో బాపుగారి బొమ్మో’ పాట తర్వాత ప్రణీత బాపూ బొమ్మగా ఫేమస్‌ అయ్యారు. ఓ పదేళ్ల క్రితం రక్షిత, ఆ తర్వాత సంజన, ఆ తర్వాత హరిప్రియ.. ఇలా శాండిల్‌వుడ్‌ నుంచి టాలీవుడ్‌కి కన్నడ భామలు వస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌ సెన్సేషన్‌ రష్మికా మండన్నా ఉండనే న్నారు. ఇప్పుడు మరో కన్నడ భామ కృతీ శెట్టి తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ సరసన మంగళూరు బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే 25న  ప్రారంభం కానుంది. కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సైన్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌ దత్‌ సైనుద్దీన్, సీఈవో: చెర్రీ, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ (సీవీఎం).

మరిన్ని వార్తలు