ముంబై : పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ హీరోయిన్ కృతి సనన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలతో అలాంటి ఫోజులు ఇవ్వడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజీన్ తన ఆగస్టు ఇష్యూలో భాగంగా ఇంగ్లండ్లోని ఓ మ్యూజియంలో కృతితో ఫొటోషూట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కవర్ పేజీ కోసం... వేలాడుతున్న జిరాఫీని పట్టుకుని ఉన్న కృతి డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను కాస్మోఇండియా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో పాటు.. ‘ఈ ఫొటోషూట్లో జిరాఫీకి ఎటువంటి హానీ కలగలేదు. ఎందుకంటే అది బతికున్న జిరాఫీ కాదు’ అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. అంతేకాకుండా చనిపోయిన మూగ జీవాలను సదరు మ్యూజియంలో పొందుపరుస్తారని, వాటిపై పరిశోధనలు జరిపేందుకు అనుమతి కూడా ఇస్తారంటూ పేర్కొంది.
కాగా ఈ ఫొటోను చూసిన జంతు ప్రేమికులు కాస్మోఇండియా, కృతిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఛీ.. పబ్లిసిటీ కోసం మూగ జీవాలను సైతం వాడుకుంటారా.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది. ఈ ఫొటోషూట్లో జిరాఫీకి ఏం జరగలేదని చెబుతున్నారు కదా. అసలు ఈ ఫొటో ద్వారా ఏం సందేశమిద్దామనుకుంటున్నారు. స్త్రీ సాధికారత ఆవశ్యకతను చెప్పేందుకు ఇంతకంటే మంచి మార్గం కనపడలేదా. ఈ ఒక్క ఫొటోతో కృతి ఆలోచనలు కూడా ఏవిధంగా ఉంటాయో అర్థమవుతోంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇది కచ్చితంగా నేరమే. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ‘పెటా’ను కోరతా’ అంటూ మరొకరు హెచ్చరించారు. కాగా గతంలో సోనమ్ కూడా ఇలాంటి ఫొటోషూట్తోనే నెటిజన్ల చేతికి చిక్కి విమర్శల పాలయ్యారు.