ఆ డేటింగ్‌ వార్తల్లో నిజం లేదు: కృతీసనన్

20 Jun, 2016 07:38 IST|Sakshi
ఆ డేటింగ్‌ వార్తల్లో నిజం లేదు: కృతీసనన్

తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న కృతీసనన్ తాజాగా వార్తల్లోకెక్కాక్కిన విషయం తెలిసిందే. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో ఆమె డేటింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ పుకార్లకు ఆమె పుల్‌స్టాప్ పెట్టేశారు.

ఇటీవలే బ్రేకప్ అయిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజ్పుత్, అంకితా లోఖాండే. హీరో సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిపీటలెక్కుతారంటూ వార్తలు అలా గుప్పుమన్నాయో లేదో ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో నటుడు సుశాంత్ నటిస్తున్నాడు. ఆ మూవీ కంటే ముందుగా రాబ్తా మూవీకి సైన్ చేశాడు. కొన్ని నెలల నుంచి రాబ్తా కూడా షూటింగ్ జరుగుతోంది.


సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. ప్రస్తుతం ‘రాబ్తా’. షూటింగ్ లో పాల్గొంటున్న సుశాంత్, కృతీసనన్  చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అంకితతో తెగదెంపులు చేసుకున్న సుశాంత్, కృతీతో కొత్త ప్రేమను వెతుక్కుంటున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కృతీతో పరిచయం పెరిగినప్పటి నుంచీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమెతో కలిసి దిగిన ఫొటో ఏదో ఒకటి అప్ లోడ్ చేస్తూ సుశాంత్ అంకితను అప్ సెట్ చేయడమే బ్రేకప్ కు కారణమని వార్తలొచ్చాయి.

అయితే తాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కృతిసనన్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకుంది. 'ఇక చాలు..సహ నటులుగా ఒకరిపై మరొకరికి ఇష్టంతో పాటూ గౌరవం కూడా ఉంది. నిరాధారమైన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. ' అంటూ కృతిసనన్ ట్విట్ చేశారు.