ధనుష్‌తో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ

28 Apr, 2016 03:03 IST|Sakshi
ధనుష్‌తో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ

 ఎంత క్రేజీ తారలైనా ఎప్పుడూ ఒకే జంట కలిసి నటిస్తే వారికే కాదు చిత్రం చూసేవారికీ బోర్ కొడుతుంది. రేర్ జంట కలయికలో అయితే ఆ చిత్రం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాంటి ఒక కొత్త కలయికలో చిత్రం రాబోతోందన్నది తాజా సమాచారం. యువ నటుడు ధనుష్, వరుస విసయాలను కైవసం చేసుకుంటున్న నటి లక్ష్మీమీనన్‌ల కలయికలో ఒక చిత్రం తెరకెక్కనుందన్నదే తాజా సమాచారం. నటుడు ధనుష్ ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తొడరి, దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో కొడి చిత్రాలను పూర్తి చేశారు.
 
  ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోకి పాయుమ్ తూట చిత్రంలో నటిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ ప్రస్తుతం విజయ్‌సేతుపతి సరసన రెక్క చిత్రంతో పాటు జీవాకు జంటగా జెమినీగణేశన్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్.దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇరైవి చిత్రాన్ని పూర్తి చేసిన కార్తీక్‌సుబ్బరాజ్ ప్రస్తుతం ధనుష్, లక్ష్మీమీనన్‌లతో చేయనున్న చిత్ర స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.