రేడియో జాకీగా రాయ్‌లక్ష్మి

21 Jan, 2017 03:13 IST|Sakshi
రేడియో జాకీగా రాయ్‌లక్ష్మి

సంచలన నటి రాయ్‌లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారు. మలయాళంలో అనూహ్య విజయం సాధించిన 100 డిగ్రి సెల్సియస్‌ చిత్రం కోలీవుడ్‌లో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. దీనిని తమిళంలో మిత్రన్  కే.జవహర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఉద్యోగం చేసే ఐదుగురు యువతులు ఒకే అపార్ట్‌మెంట్‌లో నివశిస్తుంటారు. వారి ఫ్లాట్‌లో ఒకరు హత్యకు గురవుతారు.అది తెలిసిన ఒక వ్యక్తి ఈ ఐదుగురు అమ్మాయిలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటారు.చివరికి ఏమైందన్న సస్పెన్స్  థ్రిల్లర్‌ కథా చిత్రమే 100 డిగ్రి సెల్సియస్‌.

కాగా మలయాళంలో శ్వేతామీనన్, అనన్య, భామా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో ఒక నాయకిగా నటి రాయ్‌లక్ష్మి నటించనున్నారన్న సంగతి తెలిసిందే. మరో పాత్రకు నటి శ్రియ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నటి శ్వేతామీనన్  పాత్రను రాయ్‌లక్ష్మి పోషించనున్నారు. అయితే శ్వేతామీనన్  మలయాళంలో టీవీ రిపోర్టర్‌గా నటించిన పాత్రను తమిళంలో రేడియో జాకీగా మార్చుతున్నారట. దీంతో నటి రాయ్‌లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారన్న మాట. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది.

>