‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’

20 Jul, 2017 23:20 IST|Sakshi
‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’

నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌

‘‘శమంతకమణి’ సినిమా మా భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. మా సంస్థలో ‘లౌక్యం’ చిత్రం తర్వాత 100 శాతం ప్రేక్షకులు బావుందని చెప్పిన సినిమా ‘శమంతకమణి’. కుటుంబమంతా కలిసి చూసే కథ. త్వరలో విజయయాత్ర చేయనున్నాం’’ అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ అన్నారు. నారా రోహిత్, సందీప్‌ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌.

ఈ సినిమాలో నటించిన నా మిత్రులతో మరో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చేసిన కార్తీక్‌ క్యారెక్టర్‌ నాకు చాలా మెమరబుల్‌.’’ అన్నారు ఆది. ‘శమంతకమణి’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల ఆదరణ మా అందరి గెలుపుగా భావిస్తున్నాం’’ అని సందీప్‌ కిషన్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ పాత్ర నాకు ఇచ్చినందుకు శ్రీరామ్‌ ఆదిత్యకు, ఇటువంటి చిత్రం తీసిన ఆనందప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘నా కల నిజం చేసిన మా హీరోలకు స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీరామ్‌ ఆదిత్య.