సావిత్రికి ‘చిత్రకళా’ నివాళి

1 Jun, 2018 09:22 IST|Sakshi
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న నాగఅశ్విన్, ప్రియాంకదత్‌

లలిత కళల  విద్యార్థుల వినూత్న సృష్టి

ఆకట్టుకున్న పెన్సిల్‌ స్కెచ్‌లు, పెయింటింగ్‌లు

మహానటి చిత్రానికి స్పందన అపూర్వం: నాగఅశ్విన్‌

విజయనగర్‌కాలనీ: మహానటి సావిత్రికి లలిత కళల విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. మాసబ్‌ట్యాంక్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్‌ గ్యాలరీలో గురువారం క్రియేటివ్‌ మల్టీ మీడియా కాలేజ్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌ చిత్రకళా విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన దివంగత నటి సావిత్రి చిత్ర కళాఖండాలను ‘మహానటి’ డైరెక్టర్‌ నాగఅశ్విన్, నిర్మాత ప్రియాంకదత్‌లు ప్రారంభించారు. సావిత్రి పెన్సిల్‌ స్కెచ్‌లు, పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా నాగఅశ్విన్, ప్రియాంకదత్‌లు నిర్మాత మాట్లాడుతూ.. మహానటి చిత్రానికి తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన మహానటి సావిత్రి చిత్రాలు విద్యార్థుల ప్రతిభకు దర్పణం పడుతున్నాయన్నారు. ఈ చిత్రాలు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ‘మా’ అసోసియేషన్‌కు అందజేయనున్నట్లు క్రియేటివ్‌ మల్టీ మీడియా కళాశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.రాజశేఖర్‌ తెలిపారు. ప్రదర్శనలో జూన్‌ 2 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్రాలను తిలకించవచ్చని సమన్వయకర్త వెంకట్‌ చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ఫైనార్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.వికాస్,  పెయింటింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ప్రీతి సంయుక్తలతో పాటు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు