లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా పురస్కారం

29 Jul, 2013 15:01 IST|Sakshi
లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా పురస్కారం
 ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు’ను అందించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ-‘‘వందేళ్ల భారత సినీ చరిత్రలో 60 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఘనత యశ్ చోప్రాది. 
 
 అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ అవార్డ్డును ఏర్పాటు చేశాం. ఈ అవార్డు కమిటీకి జ్యూరీ సభ్యులుగా హేమామాలిని, అనిల్‌కపూర్, సిమి గరెవాల్ వ్యవహరిస్తున్నారు. అందరం కలిసి ఈ అవార్డును లతా మంగేష్కర్‌కు అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ అవార్డు ద్వారా జ్ఞాపిక, 10లక్షల రూపాయలు నగదు బహుమతిగా అందించనున్నాం. అక్టోబర్ 19న ముంబైలో జరపనున్న ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో అతిథులుగా పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు పాల్గొంటారు. 
 
 అలాగే ఆగస్ట్ 11న సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకుగానూ విశాఖపట్టణంలో స్టార్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నాం. ఈ క్రికెట్ మ్యాచ్‌లో ప్రముఖ సినీతారలు ఆడనున్నారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణమూర్తి, ఎన్‌కే రాము, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
 
>