హర్రర్‌ చిత్రంలో రాయ్‌లక్ష్మి

3 Jul, 2019 07:02 IST|Sakshi

చెన్నై : ప్రపంచవ్యాప్తంగా దేవతా కథల్లో ప్రాముఖ్యంగా వినిపించే పేరు ‘సిండ్రెల్లా’. ఈ పేరుతో ప్రస్తుతం తమిళంలో ఒక దెయ్యపు చిత్రం రూపొందుతోంది. ఇందులో రాయ్‌లక్ష్మి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వినో వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈయన ఎస్‌జే సూర్య వద్ద సహాయ దర్శకునిగా ఉన్నారు. సిండ్రెల్లా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఇదొక దెయ్యపు చిత్రమేనని, అయితే దెయ్యపు చిత్రాలకు ఇక్కడున్న హైదర్‌ కాలపు ఫార్ములా నుంచి వైదొలగి, అన్ని అంశాలతో ఒక స్పీడ్‌ చిత్రంగా ఇది రూపొందినట్లు తెలిపారు. రాయ్‌లక్ష్మి పోషించిన పాత్ర ఆమె ఇమేజ్‌ను ఎంతగానో మారుస్తుందన్నారు. ఆమెను ఇంతవరకు గ్లామర్‌ పాత్రల్లో చూసిన అభిమానులకు ఊహించని రీతిలో ఈ చిత్రంలో కనిపిస్తుందన్నారు. సాక్షి అగర్వాల్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక కథాపాత్రలో కనిపిస్తారన్నారు. ఆమె పోషిస్తున్న ప్రతినాయకురాలి పాత్ర విలనిజంను కొత్త కోణంలో చూపిస్తుందన్నారు. గాయని ఉజ్జయిని గజరాజ్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. కాంచన–2 చిత్రానికి సంగీతం సమకూర్చిన అశ్వమిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాధారణ దెయ్యపు చిత్రాలకు భిన్నంగా కొత్త కథతో పయనించే కథా చిత్రం ఇది. తమిళం, తెలుగు రెండు భాషల్లో నిర్మిస్తున్న సిండ్రెల్లా చిత్రం ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు పూర్తి గ్యారెంటీ ఇస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు