అందుకు నో చెప్పేసిన కీర్తి సురేష్‌...

2 Jun, 2017 19:55 IST|Sakshi
హీరోయిన్‌ బరువు పెంచేందుకు తంటాలు

చెన్నై: ‘నేను శైలజా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కీర్తి సురేష్‌కు... ఆమె ఫిజిక్‌ ఇప్పుడు సమస్యగా మారింది.  ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. సావిత్రి మాదిరి గెటప్‌ వేయించి కీర్తి సురేష్‌తో చిత్రీకరణ కూడా మొదలెట్టారు. అయితే ఈ గెటప్‌ చిత్రాలు లీక్‌ అయి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో సావిత్రిలా...  కీర్తి సురేష్‌కు గెటప్‌ నప్పలేదే, ఇంకా లావైతే బాగుండు అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

దీంతో దర్శక నిర్మాతల్ని హీరోయిన్‌ బరువు సమస్య ఆలోచనలో పడేసిందని సమాచారం. కీర్తి సురేష్‌ను బరువు పెంచాలని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పినప్పుడు సరేనన్న ఈ బ్యూటీ ఆ తరువాత అది కష్టం అని చేతులెత్తేసిందట. ఆమెకు అనుష్క బాధలు గుర్తు కొచ్చాయో ఏమో..? ఓ సినిమా కోసం సుమారు 80 కిలోల బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి పడని తంటాలు లేవు. బాహుబలి–2 చిత్ర నిర్మాతలకు తన బరువు విషయంలో భారీ ఖర్చునే పెట్టించారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది.

చివరిగా గ్రాఫిక్స్‌తో అనుష్క బరువును తగ్గించారు. కాగా, మహానది చిత్రంలో కీర్తిసురేష్‌ బరువు ఇదే తీరున పెంచాలన్న నిర్ణయానికి ఆ చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం.  ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్ర షోషిస్తుండగా, ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.