సాక్షి, ముంబయి : ప్రముఖ సినీనటి శ్రీదేవీ హఠాన్మరణంపట్ల సినీలోకం, అభిమానగనం మాత్రమే కాకుండా యావత్ భారతావని తీవ్ర విచారంలోకి కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సినీనటిగా వెలుగొంది ప్రస్తుతం కీలక రాజకీయాల్లో కొనసాగుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవీ తనకు ఎంతో అభిమాన నటి అని అన్నారు. ఎవరితోను వివాదాలకు వెళ్లే వారు కాదని, అణిగిమణిగి ఉండే మనస్తత్వం ఆమె సొంతం అని చెప్పారు. 1990లో చిత్రపరిశ్రమను తన భుజాలపై వేసుకొని ఆమె నటీమణుల్లో సూపర్స్టార్గా వెలుగొందారని కొనియాడారు. ఆమె చనిపోయారనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఆమె అకాల మరణం తీనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
గత ఏడాది గోవాలో నవంబర్లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుకలకు శ్రీదేవీ వచ్చారని, ఆ సమయంలో వేదికపై ఆమె ఒక్కరే నిల్చొని కనిపించారని, అయినప్పటికీ ఆ వేదిక మొత్తం కూడా ఆమె మూర్తిమత్వ వెలుగుతో నిండిపోయిందని అన్నారు. శ్రీదేవి గొప్ప లెజెండరీ నటి అని, తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ మానవత దృక్పథంతో సాగారని చెప్పారు. మంచి క్రమశిక్షణ, ఆమె వస్త్రాధరణ, కట్టుబొట్టులో కూడా ఆమెకు ఆమెనే సాటి అని అన్నారు. తనకు ప్రోటోకాల్ కావాలని ఏనాడు శ్రీదేవీ అడిగేవారు కాదని, ఓ సామాన్య వ్యక్తిగానే ఉండేవారని చెప్పారు. హీరోలు కూడా తమ చిత్రాల బాక్సాపీస్ రికార్డులను శ్రీదేవీని చూసి అంచనా వేసేవారంటే ఆమె ఎంత ప్రభావం చూపించగల నటినో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆమెతో తనకు ఉన్న అనుభందం ఎప్పటికీ మరిచిపోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.