‘ఆయ‌న ఎంతో మందికి స్ఫూర్తి’

17 Jan, 2019 17:32 IST|Sakshi

అక్కినేని ల‌క్ష్మీ వ‌ర‌ప్రసాద్ 111వ జ‌యంతి ఉత్సవం హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఉద‌యం ఘనంగా జ‌రిగింది. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు వైవీయస్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘ఎల్వీ ప్రసాద్‌, ఎన్టీఆర్ ఇద్దరూ మ‌హావృక్షాలు. సినిమా రంగం ప‌ట్ల వ్యామోహాన్ని పెంచుకున్నారు. సినిమా రంగంలోనే తాము సంపాదించిన‌దాన్ని ఇన్వెస్ట్ చేశారు. వారి వార‌స‌త్వాన్ని వారి పిల్లలు కొన‌సాగిస్తున్నారు. నా లాహిరిలాహిరి లాహిరిలో సినిమా స‌మ‌యంలో నేను ప్రసాద్ ల్యాబ్స్ కు  8.75ల‌క్షలు క‌ట్టాల్సి ఉన్నప్పటికీ నాకు ర‌మేష్ ప్రసాద్‌గారు సాయం చేశారు. అలాగే `రేయ్` కూడా ఆయ‌న ఆశీస్సుల‌తోనే విడుద‌లైంది. ఇక‌.. నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రి మీద బ‌యోపిక్ తీసి అంద‌రి మెప్పు పొందారు. అదేవిధంగా ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయ‌న త‌న‌యుడు ఓ మంచి బ‌యోపిక్ తీయాల’న్నారు.

ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ప్రతినిధి సురేష్ కొవ్వూరి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ర‌న్ చేస్తున్నాం. త్వర‌లోనే ప్రొడ‌క్షన్‌లోకి రావాల‌నుకుంటున్నాం. ఎల్వీ ప్రసాద్‌గారి జీవితంలోని విష‌యాల‌ను ప్రతి ఒక్కరూ త‌లా రెండు పేజీలు చ‌దివి ఆచ‌రించినా చాలు’ అని చెప్పారు. రమేష్ ప్రసాద్ తనయ రాధాప్రసాద్ మాట్లాడుతూ ‘మా తాత‌గారి గురించి ఏవీ చూసి థ్రిల్ అయ్యాను. మా పూర్వీకుల విలువ‌ల‌ని, వాళ్ల ఆలోచ‌న‌ల‌ని గౌర‌వించి, కొన‌సాగిస్తాం. మా నాన్నగారు ముందుండి తాత‌గారి బ‌యోపిక్ తీయాల‌ని ఆలోచిస్తున్నాం’ అని అన్నారు.

ర‌మేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా నాన్న సినిమా వ్యక్తి. ఆయ‌న‌కు సినిమా త‌ప్ప మ‌రేమీ తెలియ‌దు. ఇంట్లో వాళ్లని కూడా ఎక్కువ‌గా క‌లిసేవారు కాదు. ఒక స్టూడియో నుంచి మ‌రో స్టూడియోకి వెళ్లే దారిలో ఆయ‌న రెస్ట్ తీసుకునేవారు. నేను ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వ‌చ్చాను. మా ప్రసాద్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కి 17 సార్లు జాతీయ పుర‌స్కారం ద‌క్కింది. మా నాన్నకు పృథ్విరాజ్‌క‌పూర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్లలాగా మా కుటుంబం కూడా సినిమాల్లోనే ఉండాల‌ని కోరుకునేవార’ని తెలిపారు.

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ‘భారత సినీ రంగంలో  ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించ‌డ‌మే. ఆయ‌న ఒక వ్యవ‌స్థ‌. న‌టుడు కావాల‌నుకున్నారు. అలాగే న‌టించారు. ద‌ర్శకుడిగా మారారు. ఆయ‌న సినిమా రంగంలో త‌న‌కు ఇష్టమైన అన్ని శాఖ‌ల్లోనూ కృషి చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న ఎంతో మందికి స్ఫూర్తి. ఎల్వీ ప్రసాద్‌గారి క‌ల‌ల్ని ఆయ‌న త‌న‌యుడు సాకారం చేయ‌డం ఆనందంగా ఉంది’ అన్నారు.

మరిన్ని వార్తలు