ప్ర‌ముఖ యాంక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

21 Apr, 2020 13:16 IST|Sakshi

క‌రోనా కాలంలో పెళ్లీ, గిల్లీ మానుకుంటే మంచిద‌ని స్వ‌యంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలే సెల‌విస్తున్నాయి. మ‌రీ అంత‌గా కావాల్సి వ‌స్తే.. 20 మందికి మించ‌కుండా పెళ్లి తతంగం పూర్తి చేయాల‌ని ష‌ర‌తులు విధించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ జంట అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకునేందుకు స‌మాయ‌త్త‌మైంది. ఈ వేడుక‌కు ఎంతో మంది అతిథుల‌ను ఆహ్వానించేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఇలాంటి విష‌మ ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకోవ‌డం వ‌ద్ద‌ని న‌చ్చ‌చెప్పాల్సింది పోయి ప్ర‌ముఖ క‌న్న‌డ‌‌ యాంక‌ర్ అకుల్ బాలాజీ వారికి బాస‌ట‌గా నిలిచాడు. (లాక్‌డౌన్‌: పోలీసులపై షాకింగ్‌ అటాక్‌!)

బెంగుళూరులోని త‌న గెస్ట్ హౌస్‌ను వివాహానికి వేదిక‌గా మార్చాడు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తూ పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాడు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ ఉల్లంఘ‌న కింద అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. కాగా అకుల్ బాలాజీ క‌న్న‌డలో ‘మానే ముండే మహాలక్ష్మి’, ‘ప్యాతే హుద్గిర్ హల్లీ లిఫు సీజన్‌ 1&2’, ‘హోసా లవ్‌ స్టోరీ’ వంటి ప‌లు రియాలిటీ షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. తెలుగులో "పెళ్లి ప్ర‌మాణాలు" అనే సీరియ‌ల్‌లో న‌టించగా, "312గో" అనే షోలో యాంక‌ర్‌గా క‌నిపించాడు. (సెలబ్రిటీల జాబితాలో నటి పనిమనిషి!)

మరిన్ని వార్తలు